కలం, వెబ్ డెస్క్ : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే (Rains Alert) అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు, పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణలో కూడా ఈ అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉండనుంది. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

