కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారి అనూష (Anusha) ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బాధ్యతలతో పాటు అదనంగా టూరిజం నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా కలెక్టర్ ఈ నియామకం చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్లు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నివేదికల రూపంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నోడల్ అధికారి సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కాగా, ఇప్పటివరకు పర్యాటక శాఖ బాధ్యతలు చూసిన పరమధామ రెడ్డి ఇకపై జిల్లా యువజన, క్రీడల అధికారిగా (DYSO) మాత్రమే తన సేవలందిస్తారని స్పష్టం చేశారు.

