కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణ పరిధిలోని సిక్కు వాడికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు అమన్జిత్ సింగ్ (Amanjit Singh) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షులు మేడిపల్లి సత్యం నగరంలోని రేకుర్తి క్యాంపు కార్యాలయంలో అమన్జిత్ సింగ్కు ఈ నియామక ఉత్తర్వులను శనివారం అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయానికి, అన్ని వర్గాలు, మతాలకు పెద్దపీట వేస్తుందని పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే సిక్కు మైనార్టీ రంగానికి చెందిన అమన్ జిత్ సింగ్ సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, సిక్కు మైనార్టీల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక వారధిలా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
అమన్జిత్ సింగ్ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన DCC అధ్యక్షులు మేడిపల్లి సత్యం, జిల్లా మంత్రులు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్, జిల్లా ముఖ్య నేతలకు అమన్ జిత్ సింగ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాలకు లోబడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడానికి, మైనార్టీల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అమన్ జిత్ సింగ్ నియామకం పట్ల కరీంనగర్ సిక్కు సమాజం, మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

