కలం, వెబ్డెస్క్: ఎన్నికల కమిషన్ను ఆర్ఎస్ఎస్, బీజేపీ గుప్పిట్లో పెట్టుకున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul) తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) ఏ తప్పు చేసినా తప్పించుకునేలా ఎన్డీఏ ప్రభుత్వం చట్టంలో మార్పు చేసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈసీని బలోపేతం చేసే చట్టాలు చేస్తామని, ఇప్పుడు తప్పు చేసినవాళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల సంస్కరణ (Election Reforms) పై మంగళవారం లోక్సభ చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
భారత ప్రజాస్వామ్యం ఓట్లే మూలస్తంభమని, వందకోట్ల భారతీయుల ఓట్ల కారణంగానే పంచాయతీల నుంచి విధానసభలు, రాజ్యసభ, లోక్సభ వరకు మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. మన దేశం సాధించిన ఎన్నో ఘనతల వెనక ఉన్నది ఓటు మాత్రమేనన్నారు. అయితే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్నికల కమిషన్ను గుప్పిట్లో పెట్టుకుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయని, ఈడీ, ఐటీ, సీబీఐ, ఎన్ఐఏ వంటివీ ఇందులో ఉన్నాయన్నారు. ఎలక్షన్ కమిషనర్ ఎంపికపై ప్రధాని మోదీకి, హోంమినిస్టర్ అమిత్ షా కు ఎందుకు అంత ఆసక్తి అని ప్రశ్నించారు.
‘ఓట్ చోరీ’ అతి పెద్ద దేశ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఎన్నికల కమిషన్ను వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి ఎందుకు బలహీనమవుతోంది? దాని స్వతంత్రను కాపాడే యంత్రాంగాలను పునరుద్ధరిస్తారా? అనేక రాష్ట్రాల నుంచి ‘సర్’పై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఓటర్ల జాబితా తారుమారు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈసీ నియామకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు ఉంటున్నాయి? పారదర్శక సంస్కరణలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందా? అని కేంద్రానికి ప్రశ్నలు సంధించారు.
కాగా, రాహుల్(Rahul) మాట్లాడుతుండగా ఎన్డీఏ కూటమి సభ్యులు పదే పదే అంతరాయం కలిగించారు. తాను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానని చెప్పేందుకు గర్వపడుతున్నానన్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే.. ముస్లింల కోసం నెహ్రూ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ విలువలతో కాంప్రమైజ్ అయ్యిందని విమర్శించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దేశంలో ‘సర్’ నిర్వహించడం ఇదే మొదటిసారి కాదన్నారు. కాగా, చర్చ ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) కాకుండా ఎన్నికల సంస్కరణల (Election reforms) పైనే కొనసాగింది.
Read Also: భారత్లో మూతపడ్డ విమాన సంస్థలు.. కారణాలేంటి?
Follow Us On: X(Twitter)


