కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson), ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మధ్య జరిగే పోరు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విశ్లేషించారు. ముంబై వేదికగా గురువారం జరగనున్న ఈ మ్యాచ్లో వీరిద్దరి మధ్య జరిగే పోరు మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్చర్ బౌలింగ్లో శాంసన్ గతంలో తడబడిన సందర్భాలు ఉన్నాయని చోప్రా గుర్తుచేశారు. టీ20ల్లో ఆర్చర్ బౌలింగ్లో శాంసన్ కేవలం 8.33 సగటుతో మూడుసార్లు అవుట్ అయ్యాడు. ముఖ్యంగా ఆర్చర్ సంజూ అహాన్ని దెబ్బతీస్తూ షార్ట్ బాల్స్తో బోల్తా కొట్టించాడని, దానికి శాంసన్ వికెట్ పారేసుకున్నాడని ఆయన పేర్కొన్నారు. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టులో ఆర్చర్ కొత్త బంతితో దాడికి దిగడం ఖాయమని, అదే సమయంలో శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని వివరించారు.
అయితే వెస్టిండీస్తో జరిగిన గత మ్యాచ్లో సంజూ శాంసన్ (Sanju Samson) ఆడిన తీరు తనను ఆకట్టుకుందని ఆకాశ్ చోప్రా అన్నారు. ఆ మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన శాంసన్, గతంలో కంటే ఎంతో పరిణతితో, నిలకడగా ఆడాడని ప్రశంసించారు. ఆర్చర్ కచ్చితంగా షార్ట్ బాల్స్ వేస్తాడని, అయితే వాటిని సిక్సర్లు కొట్టాలనే ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడాలని సూచించారు. శాంసన్ తన అహాన్ని పక్కన పెట్టి ఒత్తిడిని తట్టుకోగలిగితే ఆర్చర్ను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: టీమిండియా ఫీల్డింగ్ తిప్పలపై కోచ్ మోర్కెల్ స్పందన ఇదే..
Follow Us On: X(Twitter)

