కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా సామర్లకోట (Samarlakota) మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 20 మందికిపైగా కార్మికులు దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చనిపోయినవాళ్లకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

