కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో మార్చి 1న కలెక్టర్ల సమావేశం (Collectors Conference) జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమావేశం సచివాలయంలోని 7వ అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలను వేరుగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కలెక్టర్లు లేని సమయంలో జిల్లా పరిపాలన బాధ్యతలను అదనపు కలెక్టర్లు నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఏర్పాట్ల కోసం సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

