కలం, వెబ్ డెస్క్: ఆటకు వీడ్కోలు చెప్పాక తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర ధోని (MS Dhoni) మరోసారి ఇదే విధంగా వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన స్థలాన్ని ఇంటి కోసం కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ప్రయోజనాలకు వాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
హౌసింగ్ బోర్డు ప్రకటన ప్రకారం.. ధోనికి రాంచీలో కేటాయించిన స్థలం కేవలం ఇంటి కోసం మాత్రమే ఇచ్చింది. దానిని ఇతరత్రా అవసరాలకు వాడుకోవద్దు. అయితే, ప్రస్తుతం ఆ స్థలం కమర్షియల్ అవసరాలకు వాడుతున్నట్లు హౌసింగ్ బోర్డు గుర్తించింది. దీంతో ధోనీకి నోటీస్ ఇచ్చింది.
ఈ విషయంపై జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ సంజయ్ లాల్ పస్వాన్ మాట్లాడుతూ.. ‘టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి(MS Dhoni) కేటాయించిన హౌసింగ్ ప్లాట్ను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు తేలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేశాం’ అని తెలిపారు.

