కలం, వరంగల్ బ్యూరో: బాల్యవివాహాలను చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ (Warangal) పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (CP Sunpreet Singh) హెచ్చరించారు. బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ షేర్ ఎన్టీవో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథాన్ని వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాల్యం అమూల్యమైన దశ అని పేర్కొన్నారు.
బాల్యవివాహాలు (Child Marriages) పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. చదువు మధ్యలో ఆగిపోవడం వల్ల జీవితాంతం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిందని కమిషనర్ (CP Sunpreet Singh) గుర్తు చేశారు.
బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం అడిషనల్ డిసిపి రవి, ఏ.హెచ్.టి.యూ ఇన్స్స్పెక్టర్ శ్యామ్ సుందర్, ఎస్.ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్,షేర్ స్వచ్చంద సంస్థ జిల్లాల కో -ఆర్డినేటర్ శిరీష, జ్యానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: అనిల్ అంబానీకి బిగ్ షాక్.. రూ. 3,716 కోట్ల లగ్జరీ ప్రాపర్టీ సీజ్
Follow Us On: X(Twitter)

