కలం, వబ్ డెస్క్: అమెరికా ప్రస్తుతం స్వర్ణయుగంలో ఉందని, గత ఏడాది కాలంలో దేశం కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన మార్పును సాధించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. 2026 స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో భాగంగా ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సరిగ్గా 12 నెలల క్రితం తాను బాధ్యతలు చేపట్టినప్పుడు దేశం గందరగోళ పరిస్థితుల్లో ఉందని, ఆర్థిక వ్యవస్థ కుంటుపడి ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరిందని ఆయన గుర్తు చేశారు.
అయితే కేవలం ఒకే ఒక్క ఏడాదిలో పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దామని ట్రంప్ చెప్పారు. గత ఏడాది కాలంలో సాధించిన ఈ పరిణామం ఒక చారిత్రాత్మక మలుపు అని, దీనిని ప్రపంచం ఎన్నడూ చూడని రీతిలో సాధించిన మహా పరివర్తనగా ఆయన అభివర్ణించారు. అమెరికాను గతంలో కంటే మెరుగైన స్థితికి తీసుకువెళ్తున్నామని, గౌరవం, గర్వంతో ఈ విజయాలను దేశం ముందు ఉంచుతున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
మరో ఐదు నెలల్లో అమెరికా చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నామని, జూలై 4వ తేదీన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నామని ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. రెండున్నర శతాబ్దాల స్వేచ్ఛ, విజయం, పురోగతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
అణుయుద్ధాన్ని నేనే అడ్డుకున్నా..
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య అణు యుద్ధం రాకుండా నేనే అడ్డుకున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ యుద్ధం జరిగి ఉంటే పాకిస్తాన్ లో సుమారు 35 మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు. తన దౌత్యపరమైన చొరవ వల్లే ఈ భారీ ప్రాణనష్టం తప్పిందని ఆయన వెల్లడించారు. ఇతర దేశాల వస్తువులపై టారిఫ్ లు విధించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. టారిఫ్ లు విధించే పూర్తి హక్కు, అధికారాలు తనకు ఉన్నాయని ఆయన తెలిపారు.

