epaper
Sunday, February 22, 2026
epaper

అమెరికా నేతృత్వంలోని ‘పాక్స్​ సిలికా’ కూటమిలోకి భారత్​

కలం, వెబ్​ డెస్క్​: దేశ రాజధానిలో జరుగుతున్న ఇండియా ఇంపాక్ట్​ ఏఐ సమ్మిట్​ వేదికగా భారత్​ మరో వ్యూహాత్మక కూటమిలోకి చేరింది. కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు(ఏఐ)లో స్థిరమైన సప్లయ్​ చైన్​ ఏర్పాటుకు పనిచేసే ‘పాక్స్​ సిలికా’లోకి (Pax Silica ) శుక్రవారం అధికారికంగా చేరింది. ఇది అమెరికా నేతృత్వంలో పనిచేస్తుంది. భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ ఒప్పందంపై సంతకం చేశారు. ‘పాక్స్​ సిలికా’ బృందం, అమెరికా ఆర్థిక వ్యవహారాల ఉప విదేశాంగ కార్యదర్శి జేకబ్​ హెల్బర్గ్​, భారత్​లో అమెరికా రాయబారి సెర్గియో గోర్​ తదితరులు ఉన్నారు.

భారత్​, అమెరికా మధ్య ఇటీవలే వాణిజ్య ఒప్పందం(ట్రేడ్​ డీల్​) జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

పాక్స్​ సిలికా ఏం చేస్తుందంటే..

భవిష్యత్తుల్లో అత్యంత ముఖ్యమైనవిగా మారే కీలక ఖనిజాలు, ఏఐ రంగాల్లో సురక్షితమైన, స్థిరమైన, ఆవిష్కరణ ఆధారిత సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు ‘పాక్స్​ సిలికా’ను (Pax Silica ) ప్రారంభించారు. గత డిసెంబర్​ 12న అమెరికా రాజధాని వాషింగ్టన్​లో ఇది ప్రారంభమైంది. కీలక ఖనిజాల ముడి పదార్థాల నుంచి సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ మౌలిక సదుపాయాల వరకు సప్లయ్​ చైన్​లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని ఈ కూటమి పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా పరస్పర అభివృద్ధి, భద్రతకు కట్టుబడి ఉండేందుకు తీర్మానించింది. ఈ కూటమిలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, గ్రీస్​, ఇజ్రాయెల్​, జపాన్​, ఖతార్​, దక్షిణ కొరియా, సింగపూర్​, యుఏఈ, యూకే ఉన్నాయి. ఇందులో చేరాలని గత నెలలో భారత్​ను సెర్గియో గోర్​ ఆహ్వానించారు.

ఈ కూటమిలో చేరడంతో భారత్​, అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా సెమీ కండక్టర్లు, చిప్స్​ల తయారీలో ఉపయోగించే కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ రంగాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పెరుగుతుంది. కాగా, ప్రపంచానికి ఏఐ హబ్​గా భారత్​ను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది తోడ్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>