కలం, వెబ్డెస్క్: టీ20 వరల్డ్ కప్లో (T20 World Cup) భారీ యుద్ధాన్ని తలపించే మ్యాచ్కు వేళయింది. దాయాదులయిన భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ పోరులో తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఉన్న విభేదాలు, వివాదాలతో మ్యాచ్పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇదే సమయంలో భారత బ్యాటర్లపై పాక్ ప్లేయర్లు, మాజీ ప్లేయర్లు చేస్తున్న విమర్శలు, పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ (Usman Tariq)కు ఇస్తున్న హైప్తో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తారీక్తో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ కూడా చెప్పాడు. అయితే తాజాగా తారిక్ విషయంలో హర్బజన్ మరో ఆసక్తికర కామెంట్ చేశాడు. తారిక్ తాటతీయడానికి అభిషేక్ శర్మ ఒక్కడు చాలని హర్బజన్ (Harbhajan Singh) అన్నాడు.
ఉస్మాన్ తారిక్ బంతులను ఇంతకు ముందు ఎదుర్కోని బ్యాటర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే అభిషేక్ శర్మకు స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసని పేర్కొన్నారు. అభిషేక్ తన సహజసిద్ధమైన దూకుడును ప్రదర్శిస్తే, తారిక్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపదని హర్భజన్ అభిప్రాయపడ్డారు. భారత బ్యాటర్లు వికెట్లు సులువుగా కోల్పోకుండా ఆడితే, తారిక్ మిస్టరీని కూడా ఛేదించవచ్చని ఆయన విశ్లేషించారు.
అభిషేక్ శర్మ రీ-ఎంట్రీ
గత కొన్ని రోజులుగా కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా జట్టుకు దూరమైన అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఈ కీలక మ్యాచ్లో తిరిగి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భారత జట్టుకు పెద్ద ప్లస్గా భావిస్తున్నారు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అభిషేక్కు మంచి అనుభవం ఉందని టీమ్ వర్గాలు భావిస్తున్నాయి. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే దూకుడుగా ఆడే తత్వం అతనికి ఉందని, అదే తారిక్ వంటి బౌలర్లపై ఒత్తిడి పెంచే అవకాశం కల్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మ్యాచ్లో అభిషేక్ ఆడితే, పవర్ప్లేలో భారత్ వేగంగా పరుగులు సాధించే అవకాశం ఉందని అంచనా.
తారీక్కు హైప్ ఇందుకే..
పాకిస్థాన్ జట్టులో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు ఉస్మాన్ తారిక్ (Usman Tariq). అతని ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ బ్యాటర్లను అయోమయంలో పడేస్తోంది. సాధారణ బౌలర్లలా కాకుండా, బంతి విసిరే ముందు క్షణం ఆగి ‘స్టాండ్ అండ్ డెలివరీ’ శైలిలో బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకతగా మారింది. ఈ వైవిధ్యం వల్ల బంతి వేగం, దిశను అంచనా వేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతోంది. ఇటీవల జరిగిన ILT20 లీగ్లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకుని తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అదే ఫామ్తో భారత్పై కూడా ప్రభావం చూపాలని పాకిస్థాన్ ఆశిస్తోంది.
Read Also: ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్య? నటి తాప్సి వీడియో వైరల్
Follow Us On: Instagram


