కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Corporation) మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, తాము ప్రతిపక్షంలోనే ఉంటామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
మొత్తం 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 28 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో, ఎంఐఎం 14 స్థానాల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. స్వతంత్రంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో సస్పెన్స్ ఏర్పడింది.
అయితే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు చేతులు కలిపి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మార్గం సుగమమైంది. అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ నిర్ణయంతో నిజామాబాద్ నగర పాలక పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు లైన్ క్లియర్ అయింది.


