కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నేటితో మున్సిపల్ ఎన్నికల(Municipal Election) నామినేషన్కు గడువు ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు(Nominations) దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 902 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో రోజు 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు అందాయి. మొత్తంగా రెండు రోజుల్లో 9,276 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు కావడంతో నేడు అత్యధిక స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నామినేషన్లలో అత్యధికంగా కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి 3,379 ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్(BRS) నుంచి 2,506, బీజేపీ(BJP) నుంచి 1,709, బీఎస్పీ నుంచి 142, సీపీఐ నుంచి 88, ఎంఐఎం నుంచి 166, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక టీడీపీ నుంచి కూడా నామినేషన్లు రావడం విశేషం. ఆ పార్టీ నుంచి 10 నామినేషన్లు అందినట్లు సమాచారం. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి 13న ఫలితాలు వెల్లడించనున్నారు.


