epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

త్వరలో మార్కెట్​లోకి టెస్లా రోబోలు : మస్క్​

కలం, వెబ్​డెస్క్​: భవిష్యత్​ మొత్తం ఏఐ, రోబోలదేనని స్పేస్​ ఎక్స్​ ఫౌండర్​ ఎలాన్​ మస్క్​ (Elon Musk) అన్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న​ వరల్డ్​ ఎకనమిక్​ ఫోరమ్(WEF)​కు శుక్రవారం మస్క్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లాక్​రాక్​ సీఈవోతో ఏర్పాటుచేసిన ప్యానెల్​ చర్చలో అనేక అంశాల గురించి మాట్లాడారు. భవిష్యత్తులో రోబోలు సమాజాన్ని పూర్తిగా మార్చేస్తాయని మస్క్​ అన్నారు. మనుషుల పనిభారం చాలావరకు తగ్గిస్తాయని చెప్పారు. ఒక దశలో రోబోలే మరికొన్ని రోబోలను తయారుచేసే స్థాయికి చేరతాయని, మనుషుకంటే రోబోలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయని మస్క్​ అంచనా వేశారు.

ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులు, పిల్లలను చూసుకోవడానికి రోబోలు కావాలని కోరుకుంటారని మస్క్ చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి టెస్లా రోబోలను మార్కెట్​లోకి తెస్తామని, వాటిని ప్రజలకు అమ్ముతామని వెల్లడించారు. ఏఐ గురించి మాట్లాడుతూ.. ఏఐ ఎంతో తెలివైనదని, మరో ఐదేళ్లలో మనుషులను మించిపోతుందని చెప్పారు.

శాంతి కాదు శకలం అని పెట్టాల్సింది.. ‘బోర్డ్​ ఆఫ్​ పీస్​’పై వ్యంగ్యం

డొనాల్డ్​ ట్రంప్​ తెచ్చిన ‘బోర్డ్​ ఆఫ్​ పీస్​’ గురించి మాట్లాడుతూ.. దానికి శాంతి కాదు శకలం(ముక్క) అని పెట్టాల్సిందని మస్క్ (Elon Musk)​ ఎగతాళి చేశారు. కాగా, ఇంగ్లీష్​లో శాంతి, శకలం(ముక్క) అనే అర్థాలకు రెండక్షరాల మార్పుతో వచ్చే ‘పీస్​’ అనే పదాన్నే వాడతారు. మస్క్​ ఏమన్నారంటే.. ‘పీస్​ సమ్మిట్​ ఏర్పాటు చేసినట్లు విన్నాను. కానీ అది శాంతి గురించా? లేక గ్రీన్​లాండ్​ నుంచి ఒక చిన్న ముక్క, వెనెజువెలా నుంచి మరో చిన్న ముక్క గురించా?’ అంటూ సెటైర్​ వేశారు. అనంతరం ‘మనకు కావాల్సింది శాంతి మాత్రమే’ అంటూ నవ్వులు పూయించారు. ఇప్పటికే వెనెజువెలాను స్వాధీనంలోకి తీసుకున్న ట్రంప్​ ఇప్పుడు గ్రీన్​లాండ్​ కోసం పాకులాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మస్క్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా, ఒకప్పుడు ట్రంప్​, మస్క్​ అత్యంత సన్నిహితులు. గత అమెరికా ఎన్నికల్లో ట్రంప్​కు మద్దతుగా మస్క్​ ఆన్​లైన్​లో ప్రచారం సైతం చేశారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. కొన్ని రోజులు విమర్శించుకున్నారు. అనంతరం క్రమంగా సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో మళ్లీ ట్రంప్​ను విమర్శిస్తూ మస్క్​ వ్యాఖ్యలు చేయడం విశేషం.

మరోవైపు.. గతంలో వరల్డ్​ ఎకనమిక్​ ఫోరమ్​ను ‘ప్రజలకు జవాబుదారీతనం లేని వేదికని.. ప్రజలు ఎన్నుకోని, ప్రజలకు అవసరం లేని ఒక ప్రపంచ ప్రభుత్వంలాంటిదని’ విమర్శించిన మస్క్​.. ఇప్పుడు అదే సదస్సుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>