కలం, నల్లగొండ బ్యూరో : వ్యవసాయం ఒక విజ్ఞానమని, ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్గా మారిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) అన్నారు. శుక్రవారం సూర్యాపేట (Suryapet) జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.
దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్నగర్ (Huzur Nagar) సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 100 ఎకరాలలో రూ.150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేశారు. అంతేగాక కోదాడ సమీపంలో రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయానికి (JNV) శంకుస్థాపన చేయడమే కాక, మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న యాత్రికా సదన్, నూతన కిచెన్ షెడ్కు, మరో కోటి రూపాయల వ్యయంతో నిర్మించే డార్మెటరీ బిల్డింగులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ (Jishnu Dev Varma) వర్మ మాట్లాడుతూ.. వసంత పంచమి రోజున పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషకరమని అన్నారు. అలాగే రైతులకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాలకు, విద్యార్థులకు ఉపయోగపడే నవోదయ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గంగ, యమునా, సరస్వతి లాగే కృష్ణ, గోదావరి, కావేరి నదులు ఉండడం.. మట్టపల్లిలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని తెలిపారు.

Read Also : మిర్చి మార్కెట్ లో దళారుల దోపిడీ
Follow Us On : Twitter


