కలం, భద్రాచలం: ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించే యువతే సమాజంలో మార్పును తీసుకువచ్చి చరిత్రను తిరగరాస్తుందని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లిక్కీ బాలరాజు అన్నారు. శనివారం భద్రాచలంలో(Bhadrachalam) నిర్వహించిన డీవైఎఫ్ఐ మహాసభలో(DYFI Conference) ఆయన మాట్లాడారు. హక్కుల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం వ్యతిరేకత కాదని, అది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని బాలరాజు స్పష్టం చేశారు. యువత మౌనంగా ఉంటే సమస్యలు అలాగే కొనసాగుతాయని, ప్రశ్నించినప్పుడే మార్పు ప్రారంభమవుతుందని అన్నారు. నిరుద్యోగం, ఉపాధి లేమి, విద్యారంగ సమస్యలపై యువత తమ స్వరాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.
కుల, మత, ప్రాంతాల పేరుతో యువతను విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. మాదకద్రవ్యాలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు. సోషల్ మీడియాను కేవలం ట్రెండ్స్ కోసం కాకుండా సామాజిక మార్పుకు దోహదపడే ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా వినియోగించుకోవాలని సూచించారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కుల కోసం యువతను ఏకం చేసి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ మహాసభలో డీవైఎఫ్ఐ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

