కలం, ఖమ్మం బ్యూరో: దుమ్ముగూడెం–వెంకటాపురం నుంచి భద్రాచలం (Dummugudem-Bhadrachalam) వరకు రహదారి దెబ్బతిని మృత్యుకుహరంగా మారింది. పాత రోడ్డును తొలగించి నూతన రహదారిని నిర్మించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు కె. రంగారెడ్డి డిమాండ్ చేశారు. నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం దుమ్ముగూడెంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ దీక్షలో పాల్గొన్న రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇసుక లారీల అపరిమిత రాకపోకలే రహదారులు ధ్వంసం కావడానికి, వరుస ప్రమాదాలకు ప్రధాన కారణమని మండిపడ్డారు. ఇసుక లారీలను తక్షణమే నియంత్రించి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. మొత్తం 17 ప్రధాన డిమాండ్లతో ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
ప్రజా సమస్యలపై స్పందించని ప్రభుత్వాలకు హెచ్చరికగా ఈ పోరాట బాట పట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కార్యదర్శి దాసరి సాయన్న, డివిజన్ నాయకుడు సున్నం వీరభద్రం పాల్గొన్నారు.

