కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ తో తప్ప తెలంగాణలో ప్రతి నాయకుడిత తనకు మంచి సంబంధాలున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తనకు ఎప్పటికీ పొసగదని స్పష్టం చేశారు. కేసీఆర్ తన మీద ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ వేసి భూములన్నిటినీ జల్లెడ పట్టినా ఎక్కడ తప్పు దొరకలేదుని ఈటల గుర్తు చేశారు. ఆ సమయంలో సలసల కాగే నూనెలో వేసినట్టు బాధపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి తీసుకువచ్చి కేసీఆర్ మొదటి తప్పు చేశారని ఆయన విమర్శించారు.
ఆనాడు గ్రామస్థాయిలో రికార్డులు లేకుండా చేశారని ఈటల (Eatala Rajender) ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా అక్రమాలు చేస్తే శిక్షించాలని సూచించారు. కేసీఆర్ అక్రమాస్తుల విషయంలో 2 ఏళ్ల 9 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఎంక్వైరీ చేయలేదని నిలదీశారు. బీఆర్ఎస్ తో కుమ్మక్కయి ఇన్నాళ్లు విచారణ చేపట్టలేదని.. ఇప్పుడు ఒప్పందం కుదరక భూముల పంచాయితీ తెరమీదకు తీసుకోస్తున్నారని ఈటల ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిని వదిలిపెట్టేది లేదని.. హైకోర్టు, సుప్రీంకోర్ట్, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

