కలం, నిర్మల్: తక్కువ కన్సాలిడేటెడ్ జీతాలతో పనిచేస్తున్న వివిధ వర్గాల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే(Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. వీఏఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎస్ఆర్డీఎస్, పీటీ ఉద్యోగులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, లైసెన్స్డ్ సర్వేయర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జీతాలు పెంచాలని ఆయా వర్గాలు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతల కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన సభలో ప్రస్తావించారు. నిర్మల్ నియోజకవర్గంలో రోజుకు 5 నుంచి 6 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో సాధారణ ప్రజలతో పాటు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎలినో ప్రభావంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని, విద్యుత్ సరఫరా లేక మోటార్లు పనిచేయకపోవడంతో రైతులు పంటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యుత్ సరఫరా సమస్యపై డిప్యూటీ సీఎం వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి కోరారు.

