కలం, వెబ్డెస్క్: భారత్ను గ్లోబల్ సెమీ కండక్టర్ తయారీ హబ్గా చేయడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఢిల్లీలోని యశోభూమిలో ప్రధాని మోదీ నేడు సెమికాన్ ఇండియా 2026 (Semicon 2026) సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, ఇది దేశంలో నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులు, అభివృద్ధికి అపారమైన అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు.
సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కూడా దేశం 7.8 శాతం వృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 వరకు జరిగే ఈ ఐదవ ఎడిషన్ సదస్సుకు సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే థీమ్ను ఖరారు చేశారు.
ఇక ఇటీవల బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించుకున్నామని మోదీ అన్నారు. భారత్పై ప్రపంచానికి నమ్మకం పెరిగింది అనడానికి బ్రిక్స్ సమ్మిట్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ చిప్ తయారీపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. 10 రోజుల క్రితం ముంబైలో ఫిన్టెక్ సదస్సు జరిగిందని, ఏఐ, టోకనైజేషన్, క్వాంటంపై చర్చ జరిగిందని వెల్లడించారు.
ఏఐ అభివృద్ధి వల్ల సెమీకండక్టర్ పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ అన్నివిధాలా సిద్ధమవుతోందని తెలిపారు. గత దశాబ్ద కాలంలో దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని, అలాగే అణుశక్తి రంగంలోనూ భారత్ ముందడుగు వేస్తోందని వెల్లడించారు.

