కలం, వేములవాడ: వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ తిప్పాపూర్ గోశాలలో సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా జతల కోడెల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్లతో కలిసి ఈ పంపిణీని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, జిల్లా స్థాయి కమిటీ ద్వారా అత్యంత పారదర్శకంగా అర్హులైన రైతులను ఎంపిక చేసి కోడెలను అందజేస్తున్నట్లు వెల్లడించారు.
అక్రమ తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు
పంపిణీ చేసిన కోడెలను రైతులు ఎంతో బాధ్యతగా సంరక్షించుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. కోడెల అక్రమ తరలింపులు లేదా అమ్మకాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వామివారికి మొక్కుబడులుగా చెల్లించే క్రమంలో భక్తులు పాలు మరవని చిన్న కోడెలను, జెర్సీ జాతి కోడెలను తీసుకురావద్దని.. కేవలం ఆరోగ్యంగా ఎదిగిన దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో నిర్ణీత రుసుం చెల్లించి నిజ కోడెను సమర్పించే అవకాశం కూడా ఉందన్నారు. వేములవాడలో దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన గోశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కేఎస్బీ కుమారి, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

