కలం, దమ్మపేట : విధి నిర్వహణలో నిత్యం కఠినంగా వ్యవహరిస్తూ తనిఖీలు, సమీక్షలతో బిజీగా ఉండే అధికారుల్లోనూ ఒక క్రీడాకారుడు ఉంటాడని నిరూపించారు డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ తహసీల్దార్) మద్దినేని మురళి (Maddineni Murali). శనివారం దమ్మపేట మండలం మొండివర్రె గ్రామంలో ఎస్ఐఆర్ స్పెషల్ డ్రైవ్ తనిఖీల కోసం వెళ్లిన ఆయన, అక్కడ వాలీబాల్ ఆడుతున్న స్థానిక యువకులను చూసి కాసేపు తన అధికారిక హోదాను పక్కనపెట్టారు. నేరుగా వాలీబాల్ కోర్టులోకి అడుగుపెట్టి యువకులతో పోటీపడి ఆడుతూ సందడి చేశారు.
క్షణాల వ్యవధిలోనే ఒక కఠినమైన అధికారి నుంచి స్పోర్ట్స్ మ్యాన్గా మారిపోయిన మురళి, ఆటలో యువకులకు గట్టి పోటీనిచ్చారు. అంతేకాకుండా యువత నిత్యం క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమివ్వాలని ప్రోత్సహించారు. నిత్యం క్రమశిక్షణ, గంభీరమైన వాతావరణంలో ఉండే అధికారి ఇలా తమతో సరదాగా కలిసిపోవడంపై యువకులు ఆనందం వ్యక్తం చేశారు. విధిలో ఎంత కఠినంగా ఉన్నా, మనసులో అంతే మృదుత్వం చూపించిన ఆయన క్రీడా స్ఫూర్తి అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.

