మలేషియాకు షాక్.. ఫైనల్లోకి భారత్!

కలం, స్పోర్ట్స్ : ఆసియన్ హాకీ ఫెడరేషన్ జూనియర్ ఆసియా కప్‌ (Junior Asia Cup) లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో మలేషియాను 3-1తో ఓడించింది. దీంతో టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు భారత్ మరో అడుగు ముందుకు వేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. తొలి క్వార్టర్‌లో మూడు పెనాల్టీ కార్నర్లు వచ్చినా గోల్ చేయలేకపోయింది. మలేషియా గోల్‌కీపర్ అద్భుతమైన సేవ్‌లతో భారత్‌ను అడ్డుకున్నాడు. దీంతో తొలి క్వార్టర్ 0-0తో ముగిసింది.

రెండో క్వార్టర్‌లో భారత్ ఖాతా తెరిచింది. 16వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ అన్మోల్ ఎక్కా గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాఫ్‌టైమ్ వరకు అదే స్కోరు కొనసాగింది. మూడో క్వార్టర్‌లో మలేషియా ఒత్తిడి పెంచింది. అయితే భారత గోల్‌కీపర్ వివేక్ లక్రా అద్భుతమైన సేవ్‌లు చేశాడు. ముఖ్యంగా 34వ నిమిషంలో వరుసగా రెండు షాట్లను అడ్డుకున్నాడు. భారత జట్టు కొంతసేపు 10 మంది ఆటగాళ్లతో ఆడినా, డిఫెన్స్ మాత్రం గట్టిగా నిలిచింది.

నాలుగో క్వార్టర్‌లో భారత్ మ్యాచ్‌ను పూర్తిగా తన వైపు తిప్పుకుంది. 51వ నిమిషంలో సుఖ్‌విందర్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-0కు పెరిగింది. ఆ తర్వాత మలేషియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. కానీ లక్రా అద్భుతంగా అడ్డుకున్నాడు. వెంటనే భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. మలేషియా వీడియో రిఫరల్ కోరినా నిర్ణయం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అన్మోల్ ఎక్కా మరోసారి గోల్ చేసి స్కోరును 3-0కు చేర్చాడు.

చివర్లో మలేషియా వరుసగా పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. 24 సెకన్లు మిగిలి ఉండగా ఎం. రహుల్ గోల్ చేశాడు. దీంతో స్కోరు 3-1 అయింది. అయితే అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. చివరకు భారత్ 3-1తో గెలిచి ఫైనల్‌కు చేరింది. అన్మోల్ ఎక్కా రెండు గోల్స్‌తో మెరిశాడు. అతడి టోర్నీ గోల్స్ సంఖ్య 16కు చేరింది. కీలక సేవ్‌లతో ఆకట్టుకున్న వివేక్ లక్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>