కలం, నిర్మల్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీ అమరుల సేవలు చిరస్మరణీయమని అటవీ అధికారులు కొనియాడారు. జాతీయ అటవీ అమరుల దినోత్సవాన్ని శుక్రవారం నిర్మల్ (Nirmal) పట్టణ శివారులోని శ్రీ గండి రామన్న అర్బన్ పార్క్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అమరుల స్థూపం వద్ద అటవీ మండల అధికారి నాగిని భాను పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.
అనంతరం విధి నిర్వహణలో అమరులైన అటవీ సిబ్బంది కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణలో అమరులు అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాసర సర్కిల్ నిఘా విభాగం అటవీ మండలాధికారి శివకుమార్, ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు, జిల్లా అటవీ క్షేత్ర అధికారులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

