కలం, హనుమకొండ : నకిలీ ప్లెడ్జ్ రసీదుతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో హనుమకొండ పోలీసులు (Hanumakonda Police) ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్, సీఈఓ, వడ్డేపల్లి రంజిత్ (39), వ్యాపారిని అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి రంజిత్కు చెందిన సుమారు 640 గ్రాముల బంగారం యూనియన్లో తాకట్టు ఉన్నట్లు నకిలీ పత్రం సృష్టించారు. దాన్ని నమ్మిన గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి, బంగారాన్ని పరిశీలించకుండానే RTGS ద్వారా రూ.59,30,000ను యూనియన్ ఖాతాకు బదిలీ చేశారు. అనంతరం ఆ నగదును ఇతర అవసరాలకు మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీసులు నిందితుల మొబైల్ ఫోన్లు, నకిలీ ప్లెడ్జ్ కాపీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా, ఇదే తరహాలో ఇతర సంస్థలను మోసం చేశారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు, ప్రజలు తాకట్టు బంగారాన్ని ప్రత్యక్షంగా ధృవీకరించిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.

