కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని (Bhoraj Mandal) రాంపూర్ (టీ), గిమ్మ (బీ), గూడ, హత్తిఘాట్ గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు చేపడుతున్న భూసేకరణకు సంబంధించి ఈ నెల 9న ఓ ప్రధాన దినపత్రికలో ప్రచురితమైన కథనంలో వాస్తవాలు సరిగా ప్రతిబింబించలేదని జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షి షా తెలిపారు. నాలుగు గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మొత్తం 2,062.01 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
ఎం/ఎస్ జి.ఎస్. బయోటెక్ సంస్థకు చెందిన కొన్ని భూములను రుణ బకాయిల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిందన్నారు. అయితే ఈడీ అటాచ్ చేసిన 500 ఎకరాలకు పైగా భూమిని సేకరిస్తున్నట్లు కథనంలో పేర్కొనడం వాస్తవం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్సీఎల్టీ లిక్విడేటర్ అందించిన జాబితా ప్రకారం, ఈడీ అటాచ్ చేసిన భూముల్లో కేవలం 47.22 ఎకరాలు మాత్రమే ప్రస్తుత భూసేకరణ ప్రతిపాదనల్లో ఉన్నాయని తెలిపారు.
గ్రామాల వారీగా భూముల వివరాలు
- గూడ: 259.23 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 37.23 ఎకరాలు.
- రాంపూర్ (టీ): 333.38 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 9.39 ఎకరాలు.
- గిమ్మ (బీ): 274.09 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి లేదు.
- హత్తిఘాట్: 1,149.11 ఎకరాలు సేకరణకు ప్రతిపాదించగా, ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూమి లేదు.
మొత్తంగా 2,062.01 ఎకరాల భూమి సేకరణకు ప్రతిపాదించగా, అందులో ఈడీ అటాచ్ చేసిన భూమి 47.22 ఎకరాలు మాత్రమేనని, భూములను సేకరిస్తున్నారంటూ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా ఇలాంటి కథనాలు ప్రచురించడం వల్ల భూ యజమానులు, ప్రజల్లో అనవసరమైన అపోహలు, ఆందోళనలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.

