కలం, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తక్కువ ఖర్చుతో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఫ్రాన్స్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఇస్రో సాంకేతికత కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా రైతులు, మత్స్యకారుల సంక్షేమానికి, వాతావరణ సమాచారానికి, విపత్తు నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు.
ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430 కంటే ఎక్కువ ఉపగ్రహాలను భారత రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా చేరవేశాయని గుర్తుచేశారు. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల రాత్రింబవళ్ల కృషి వల్లే ఈ నమ్మకం, గుర్తింపు సాధ్యమయ్యాయని కొనియాడారు. ‘వసుధైవ కుటుంబకం’ భావనతోనే భారత అంతరిక్ష ప్రయాణం ముందుకు సాగుతోందని, అంతరిక్ష రంగాన్ని సురక్షితంగా, శాంతియుతంగా ఉంచుతూ మానవాళి శ్రేయస్సుకు వినియోగించడమే భారతదేశ ముఖ్య లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

