కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని ఖానాపురంలో దారుణం (Khammam Crime) జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భార్యను కారులోనే గొంతు నులిమి భర్త దారుణంగా హత్య చేశాడు. నూరేళ్ల పంటగా భావించి చేయిపట్టిన భార్యను పెళ్లయిన నాలుగు నెలలకే అంతమొందించిన భర్త, మృతదేహాన్ని కారులోనే వదిలేసి పరారయ్యాడు. పోలీసులు, బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడుకు చెందిన కారు డ్రైవర్ మేడిపల్లి విద్యాసాగర్కు, చిన్నబోయిన రేణుకతో నాలుగు నెలల క్రితం వివాహమైంది.
వివాహేతర సంబంధం అనుమానంతో దారుణ హత్య!
ప్రస్తుతం వీరు ఖమ్మం నగరంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఖానాపురం (Khanapuram) పరిధిలో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా రేణుక ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న విద్యాసాగర్, ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం ఇద్దరూ కలిసి కారులో బయలుదేరగా, మార్గమధ్యంలో మళ్లీ వివాదం మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యాసాగర్ కారులోనే రేణుక గొంతు నులిమి కడతేర్చాడు.
కారులోనే హత్య.. మృతదేహం వదిలి పరార్
అనంతరం మృతదేహంతో ఉన్న కారును ఖానాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద వదిలిపెట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. విద్యాసాగరే అనుమానంతో రేణుకను హత్య చేసి పారిపోయాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడు విద్యాసాగర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

