కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనాన్ని మున్సిపల్ అధికారులు పశువుల కొట్టంగా, గోదాముగా మార్చారని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపించారు. మంగళవారం అంబేద్కర్ భవనాన్ని సందర్శించిన వారు అక్కడి సమస్యలను పరిశీలించారు. భవనం ఆవరణలో పశువులు, చెత్త తరలించే వాహనాలు, జేసీబీలు పార్కింగ్ చేస్తున్నారని, బతుకమ్మ చీరల సంచులు, వికలాంగుల ట్రైసైకిళ్లు తదితర సామగ్రిని నిల్వ చేస్తున్నారని తెలిపారు.
భవనం లోపల, బయట చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పేరుకుపోయాయని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. కిటికీలు, తలుపులు దెబ్బతిన్నప్పటికీ మరమ్మతులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దళిత సంఘాల పోరాటంతో రూ.3.50 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని 2022లో ప్రారంభించారని గుర్తుచేశారు. అంబేద్కర్ భవనాన్ని వెంటనే శుభ్రపరిచి, పశువులు, వాహనాలు, ఇతర సామగ్రిని తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. భవనాన్ని దళిత సంఘాల ఐక్యవేదికకు లేదా సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంటోల్ల వెంకటస్వామి, బత్తుల రంజిత్, కొంతం మురళీధర్, ఎలుమల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

