కలం, నిర్మల్: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బాసరతో పాటు జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోజుకు 2.5 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా తదితర సౌకర్యాలను ముందస్తుగా ఏర్పాటు చేయాలని సూచించారు. బాసర మాస్టర్ప్లాన్లో భాగంగా రూ.354 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో కీలక పనులను పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ, అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ భక్తుల భద్రతకు ప్రత్యేక పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు. 24 గంటలపాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిఘా కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బైంసా ఏఎస్పీ సాయికిరణ్, అధికారులు పాల్గొన్నారు.

