కలం, స్పోర్ట్స్ : న్యూయార్క్లో జరుగుతున్న యూఎస్ ఓపెన్లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (Alexander Zverev) క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో 21వ సీడ్ ఇటలీ ఆటగాడు లూసియానో దర్దేరీపై 6-2, 6-2, 7-6(3)తో వరుస సెట్లలో విజయం సాధించాడు. టోర్నీ ఆరంభంలో ఐదు సెట్ల మ్యాచ్లతో ఇబ్బందిపడిన జ్వెరెవ్.. ఆ తర్వాత వరుస విజయాలతో తన ఫామ్ను అందుకున్నాడు. రోమ్లో గతంలో దర్దేరీ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో బదులిచ్చాడు. మ్యాచ్లో 72 శాతం ఫస్ట్ సర్వ్లు ఇన్ప్లేలోకి తీసుకురాగా, వాటిలో 86 శాతం పాయింట్లను గెలుచుకుని ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
టోర్నీ ప్రారంభంలో తనలో ఆత్మవిశ్వాసం కొంత తక్కువగా ఉండేదని జ్వెరెవ్ చెప్పాడు. అయితే వరుస విజయాలు తనలో నమ్మకాన్ని పెంచాయని తెలిపాడు. మ్యాచ్ మ్యాచ్కూ తన ఆటతీరు మెరుగవుతోందని, క్వార్టర్ ఫైనల్ పోరుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. 2026 సీజన్లో రోలాండ్ గారోస్ ఛాంపియన్గా నిలిచిన జ్వెరెవ్.. ఈ ఏడాది నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ క్వార్టర్ ఫైనల్స్కు చేరిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో యూఎస్ ఓపెన్లో అతడి టైటిల్ వేట మరింత ఆసక్తికరంగా మారింది.

