కలం, నిర్మల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్లు ఆగాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం సరికాదని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీష్ (Maram Jagadish) అన్నారు. ఇప్పటికే రెండున్నరేళ్లు ఓపికగా వేచి చూశామని.. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సంఘ భవనంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఛలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం కోట్ల రూపాయల బెనిఫిట్స్ పొందుతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హక్కుల సాధన కోసం చేపడుతున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ ప్రభాకర్, పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

