కలం, ఖమ్మం బ్యూరో: ప్రియురాలికి ఐఫోన్ బహుమతిగా ఇచ్చేందుకు ప్రియుడు గంజాయి స్మగ్లర్గా మారిన ఘటన ఇది. సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ప్రియురాలితో కలిసి గంజాయి రవాణా చేస్తూ వైరా (Wyra) పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన చైతన్య, హేమలత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ఐ ఫోన్ కావాలని కోరడంతో చైతన్య గంజాయి స్మగ్లింగ్ చేస్తే బాగా డబ్బులు వస్తాయని ప్లాన్ వేశాడు. ప్రియురాలితో ఒడిశా వెళ్లి రూ.16 వేలు పెట్టి 12 కిలోల గంజాయి కొనుగోలు చేశారు.
ఎస్సైని ఢీ కొట్టి..
ఒడిశా నుంచి బైక్పై గంజాయి తీసుకొస్తుండగా ఖమ్మం జిల్లా వైరా వద్ద పోలీసుల కంట పడ్డారు. తప్పించుకునే క్రమంలో బైక్తో ఢీకొట్టడంతో వైరా ఎస్సై గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన గంజాయి, బైక్, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపై గతంలోనే నాలుగు కేసులు ఉన్నాయని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

