కలం, నిర్మల్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కార ప్రగతిని పరిశీలించారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ నిర్ణీత గడువులోగా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.
సాంకేతిక లేదా ఇతర కారణాలతో ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే.. అందుకు గల స్పష్టమైన కారణాలను రికార్డులలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే 22ఏ (22A) నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, నిబంధనల మేరకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుదారులకు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం సేవలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

