కలం, కోరుట్ల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది.
420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ బీఆర్ఎస్ నాయకులు 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన చేపట్టారు. కోరుట్ల బస్స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కార్గిల్ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఈ ఫ్లెక్సీలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలు, వాటిలో అమలైనవి ఎన్ని, ఇంకా నెరవేర్చాల్సినవి ఎన్ని అనే వివరాలను సమగ్రంగా పొందుపరిచి ప్రజలకు వివరించారు. ఈ వినూత్న రోడ్ ప్రదర్శన స్థానికంగా తీవ్ర ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు పేదలతో సహా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ పోరాటం చేపట్టామని, ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం బీఆర్ఎస్ పక్షాన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ ధర్నా , భారీ ఫ్లెక్సీ ప్రదర్శనలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

