ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దు.. బిఎల్ఓలకు కలెక్టర్ ఆదేశాలు

కలం, జోగులాంబ గద్వాల: మ్యాపింగ్‌ కానీ, అనామిలిస్ జాబితాలో ఉన్న ఓటర్లతో అనవసర ధ్రువపత్రాలు సేకరించకుండా, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే పత్రాలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్ బాషా షేక్ (Gadwal Collector Rizwan Basha Shaik) అధికారులను ఆదేశించారు. బుధవారం గద్వాలలోని 30వ, 16వ వార్డులకు సంబంధించి 250, 255, 256 పోలీస్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓలు నిర్వహిస్తున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సిబ్బంది ఓటర్ల నుంచి సేకరించిన ధ్రువపత్రాలను పరిశీలించిన కలెక్టర్‌ కొందరి నుంచి అవసరానికి మించి పత్రాలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తించారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల్లో లేని డాక్యుమెంట్స్ ను ప్రజలను అడగవద్దని బిఎల్ఓలకు ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన జిరాక్స్‌ల కోసం ప్రజలు డబ్బులు ఖర్చు చేయడంతో పాటు, ఒకే పని కోసం పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. ప్రతి నో మ్యాపింగ్‌ కేసును ముందుగా ఏ, బీ, సీ కేటగిరీలుగా సరిగ్గా గుర్తించాలని కలెక్టర్ సూచించారు.

ఏ కేటగిరీకి ఎన్ని పత్రాలు అవసరమో సిబ్బంది స్పష్టంగా తెలుసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్ బాషా షేక్  తెలిపారు. అవసరమైన పత్రాల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల తర్వాత ఆన్‌లైన్‌ పరిశీలనలో సమస్యలు, తిరస్కరణలు ఏర్పడి సిబ్బందికి రెట్టింపు పని అవుతుందని పేర్కొంటూ సరైన అవగాహన, స్పష్టతతో ముందుకెళ్లాలన్నారు. మ్యాపింగ్ కానీ జాబితాలో ఉన్న ఓటర్ల ఇంటికి వెళ్లి నోటీసు అందజేసిన తర్వాత అవసరమైన పత్రాల గురించి వివరించి సేకరించాలని ఆయన ఆదేశించారు.

ప్రజలకు మొదటి దశలోనే స్పష్టంగా సమాచారం ఇవ్వాలని, పత్రం మిస్‌ కావడం లేదా అనవసరమైన పత్రం తీసుకోవడం వల్ల వారిని పలుమార్లు తిప్పించుకునే పరిస్థితి ఉండకుండా వ్యవహరించాలన్నారు కలెక్టర్. ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో స్పష్టత లేని క్షేత్రస్థాయి సిబ్బందికి మరోసారి సమగ్రంగా శిక్షణ ఇవ్వాలని అదనపు ఏఈఆర్ఓ ను ఆదేశించారు.

ఏ, బీ, సీ కేటగిరీల గుర్తింపు, అవసరమైన ధ్రువపత్రాలు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే విధానంపై సమగ్రంగా అవగాహన కలిగించాలని కలెక్టర్‌ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. సందేహాస్పద కేసులను వెంటనే తిరస్కరించకుండా, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో కౌన్సిలర్లు వేదవతి, చంద్రశేఖర్, అదనపు ఏఈఆర్ వో సతీష్, సూపర్వైజర్ లు మృదుల, తిమ్మప్ప, బిఎల్వోలు వెంకట నరసమ్మ, మంజుల రాణి, సునీత, తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>