కలం, వెబ్ డెస్క్: ఏపీలో పాయకరావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఆయన కీలక ప్రసంగం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం ఎంతో శ్రమించిందన్నారు. ఈ ప్రయాణంలో అనేక అడ్డంకులను అధిగమించామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాల్వ నిర్మాణం కోసం రూ.4,000 కోట్లు వెచ్చించామని గుర్తుచేశారు.
గత వైసీపీ పాలనా వైఫల్యాల వల్ల కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయి ప్రాజెక్టు పనులు తీవ్రంగా మందగించాయని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా భావించి, తాము ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు. ఈ జలవిజయం ప్రజల విజయమని చంద్రబాబు అన్నారు.
భవిష్యత్తులో ఉత్తరాంధ్ర సస్యశ్యామలంతో పాటు పారిశ్రామికంగానూ అగ్రగామిగా మారుతుందని చంద్రబాబు భరోసా కల్పించారు. ఇందులో భాగంగా అనకాపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

