కలం, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసి, కమిషనర్గా కొనసాగేలా తీర్పు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సింగిల్ జడ్జి తీర్పునే డివిజన్ బెంచ్ కొనసాగిస్తుందా.. లేదా రంగనాథ్ను తొలగించాలని మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించబోతుందా.. అనే ఆసక్తి నెలకొంది.
అసలేం జరిగిందంటే..
మేడ్చల్ జిల్లా లోతుకుంట పరిధిలోని 40 ఎకరాల వివాదాస్పద భూమి విషయమై గతంలో హైకోర్ట్ స్టే విధించింది. అందులోకి ఎవరు ప్రవేశించరాదని స్పష్టం చేసింది. హై కోర్ట్ ఆదేశాలను ధిక్కరించి, హైడ్రా సిబ్బంది అందులో నిర్మాణాలు కూల్చివేయడంపై యజమానిగా ఉన్న శాంతారాం కన్స్ట్రక్చన్ కంపెనీ రంగనాథ్పై కోర్ట్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్ సింగిల్ జడ్జి బెంచ్.. రంగనాథ్ను వెంటనే కమిషనర్ పదవి నుంచి తొలగించాలని జులై 27న ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీలైనంత త్వరగా ఐజీ స్థాయి అధికారిని ఆ స్థానంలో నియమించాలని సూచించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

