కలం, వెబ్డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) హాట్ టాపిక్గా మారారు. రాజగోపాల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్గా మారింది. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించిన ఎక్స్ స్పేస్లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలు సోషల్ మీడియా పోస్టులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పోస్టుల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజల మంచి కోసం నిర్ణయాలు తీసుకోవాలని, వారికి చెడు జరిగే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందని రాజగోపాల్ విమర్శించారు. రైతు భరోసా పేరుతో పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ బెల్ట్ షాపులతో ప్రభుత్వమే లాక్కుంటుందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అవినీతి విస్తరించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మార్పు దిశగా అడుగులు వేస్తున్నానని, త్వరలో సంచలన నిర్ణయం తీసుకుంటానని ఆయన ఈ ఆన్లైన్ చర్చలో చెప్పినట్లు వైరల్ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో సైతం సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆడియో నిజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా వైసీపీ తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వనుందని, రాజగోపాల్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారని పుకార్లు మొదలయ్యాయి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి నుంచి స్వయంగా ప్రకటన వస్తే గానీ ఈ ఆడియో వెనుక నిజానిజాలు బయటకు రావని తెలుస్తోంది.

