కలం, వెబ్డెస్క్: హైదరాబాద్లో ఓ జెప్టో రైడర్ (Hyderabad Zepto Rider ) పట్ల ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భార్య ఆస్పత్రిలో ఉండి అత్యవసర పరిస్థితుల్లో జెప్టో పని చేస్తున్న అతడి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. నో పార్కింగ్ జోన్లో బైక్ పెట్టాడనే కారణంతో సిబ్బంది అతడి బైక్ను క్రేన్ ద్వారా ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు వారిని కన్నీళ్లతో వేడుకున్నాడు. ‘సార్.. నా భార్య ఆసుపత్రిలో ఉంది, ఒక్క ఆర్డర్ డెలివరీ చేసి వస్తాను’ అంటూ బతిమాలుకున్నా అధికారులు కనికరించలేదు.
అతడు పదే పదే రిక్వెస్ట్ చేయడంతో సదరు పోలీస్ అధికారి ఏకంగా రైడర్పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ రైడర్ చేసేదేం లేక బాధతో వెనక్కి వచ్చేశాడు. కనీస మానవత్వం చూపకపోగా.. కష్టాల్లో ఉన్న ఓ కార్మికుడిపై పోలీసులు ప్రదర్శించిన ఈ దాష్టీకం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కడుపు చేతపట్టుకుని జీవనం సాగిస్తున్న సామాన్యులపై అధికారుల ఇలా రాక్షసంగా ప్రవర్తించడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. జెప్టో రైడర్లు ఆర్డర్ డెలివరీ చేసి వెంటనే వెళ్లిపోతారు కదా.. కొద్దిసేపు బైక్ పెట్టుకున్నంత మాత్రాన వచ్చిన నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.

