కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వశిష్ఠ బ్రిడ్జి (Chinchinada Bridge) వద్ద విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా సాయి (29), అతని భార్య శిరీష (28) అనే దంపతులు తమ మూడేళ్ల చిన్నారితో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చారు. అనంతరం పాపను తాము వచ్చిన స్కూటీ పైనే కూర్చోబెట్టి, ఇద్దరూ కలిసి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
చీకట్లో చలికి వణుకుతూ, ఏమి జరుగుతుందో తెలియక ఆ చిన్నారి అమ్మా.. నాన్న అంటూ ఏడుస్తూ ఎదురుచూస్తున్న దయనీయ దృశ్యం స్థానికులను కలచివేసింది. చిన్నారి ఏడుపు విని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

