కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని దారుస్సలాం వద్ద ఉన్న ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జల్సా-యే-రహ్మతుల్-లిల్-ఆలమీన్ సభలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రసంగించారు. పాఠశాలకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థిని కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిజాబ్ ధరించకూడదని కోర్టు చెప్పిన తీర్పుతో తాను ఏమాత్రం ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు.
ఈ రోజు వెలువడిన తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, ఆర్టికల్ 19 కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇస్లాం మతంలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించడానికి ఇతరులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఈ తీర్పు ఇస్లాం భావజాలంపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు.
దేశంలోని ప్రతి సమాజానికి సొంత నాయకత్వం ఉన్నప్పుడు, ముస్లింలకు ఎందుకు ఉండకూడదని ఓవైసీ ప్రశ్నించారు. బీహార్లో ఐదు స్థానాలు గెలుపొందినట్లే, రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మజ్లిస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 18 కోట్లకు పైగా జనాభా ఉన్న ముస్లిం సమాజానికి పార్లమెంట్లో కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే ఉండటం ఆందోళనకరమని, వారి సమస్యలపై మాట్లాడే నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు.

