కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతంలోని చారిత్రాత్మక కుతుబ్ షాహీ సమాధుల (Qutub Shahi tombs) కాంప్లెక్స్ సమీపంలో రహస్య సొరంగం వెలుగుచూసింది. 400 ఏళ్ల నాటి ఈ పురాతన వారసత్వ కట్టడం పరిధిలోని స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ రంగంలోకి దిగారు.
ఈ అక్రమ తవ్వకాలు, రహస్య సొరంగం వ్యవహారంపై ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులకు ఫిర్యాదు చేశారు. పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఈ సొరంగం ఎక్కడికి వెళ్తుంది? దీని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

