కలం, స్పోర్ట్స్: వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ డిఫెన్స్లో భారత గ్రాండ్మాస్టర్ డి. గుకేష్కు కఠినమైన సవాలు ఎదురుకానుంది. ఉజ్బెకిస్థాన్ ఆటగాడు జవోఖిర్ సిందరోవ్తో జరిగే ఈ పోరు, గుకేష్ చెస్ నైపుణ్యం కంటే ఆయన మానసిక దృఢత్వానికే పెద్ద పరీక్ష అని తోటి గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ (Vidit Gujrathi) అభిప్రాయపడ్డారు. 2024లో అద్భుతమైన ప్రదర్శన చేసిన గుకేష్, వరల్డ్ ఛాంపియన్గా నిలిచాక కొంత వెనుకబడ్డారు. మరోవైపు ప్రత్యర్థి సిందరోవ్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు.
ఆటగాళ్లకు ఫామ్ తగ్గడం సహజమని, ఇది వారి సామర్థ్యం తగ్గడాన్ని చూపదని విదిత్ తెలిపారు. గుకేష్ తన పాత మైండ్సెట్ను మళ్లీ గుర్తుతెచ్చుకుని, మానసిక ఒత్తిడిని అధిగమిస్తే తిరిగి పతాక స్థాయికి చేరుకోగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాబోయే చెస్ ఒలింపియాడ్పై మాట్లాడిన విదిత్, భారత జట్టు బలంగా ఉందన్నారు. ప్రజ్ఞానానంద్, అర్జున్ ఇరిగైసి, నిహాల్ సరిన్ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పారు. అయితే ఉజ్బెకిస్థాన్, అమెరికాల నుంచి భారత్కు గట్టి పోటీ తప్పదని విశ్లేషించారు.
ఇటీవలే అర్జున అవార్డుకు ఎంపికవ్వడంపై విదిత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గుర్తింపు క్రీడాకారుల సాధనకు ఎంతో విలువను ఇస్తుందన్నారు. వరుస టోర్నీలతో అలసిపోవడం వల్లే తాను కొంతకాలం విరామం తీసుకున్నానని, ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నానని తెలిపారు. అలాగే ఫార్మాట్ల నిర్వహణపై స్పష్టత ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

