కలం, నిర్మల్: ఆయిల్ పామ్ సాగుతో రైతులు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) అన్నారు. గురువారం నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలో (Mujgi Village) రైతు మల్లయ్య సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా తోటలో పంట పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అల్లోల.. సాగు విధానం, పెట్టుబడి, దిగుబడి, నిర్వహణ తదితర అంశాలను రైతును అడిగి తెలుసుకున్నారు. పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు, దిగుబడి వివరాలపై ఆరా తీశారు.
అనంతరం ఆయన (Allola Indrakaran Reddy) మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట రైతులకు మంచి వాణిజ్య పంటగా మారుతోందన్నారు. ఒకసారి మొక్కలు నాటిన తర్వాత సుమారు 25 సంవత్సరాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉండటం వల్ల రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం లభిస్తుందని తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమ భూమి పరిస్థితులు, నీటి వసతి, సాగు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అనుకూలమైన పంటలను ఎంచుకోవాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టే ముందు పెట్టుబడి, నిర్వహణ, నీటి అవసరం, మార్కెటింగ్ వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
Also Read : కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు నమోదు
Follow Us On: X(Twitter)

