కలం, కరీంనగర్ బ్యూరో: నేడు ప్రపంచ దేశాలతో పోటీపడి ప్రపంచం గర్వించే విధంగా భారతదేశం ఎదగడానికి కారణం దివంగత నేత, మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి (Rajiv Gandhi Jayanti) సందర్భంగా ధర్మపురి (Dharmapuri) మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని నంది చౌరస్తాలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత దేశానికి కంప్యూటర్లను పరిచయం చేశారని అన్నారు. వారి స్ఫూర్తితో మొదలైన కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగంలో భారతదేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని అన్నారు. లక్షలాదిమంది నైపుణ్యం పెంచుకొని ప్రపంచ దేశాల్లో సాఫ్ట్ వేర్ రంగాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు.
దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలని, ఓటు హక్కు వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి భారతదేశ ప్రజాస్వామ్యంలో యువతను భాగస్వాములను చేశారని అన్నారు. దేశ ఐక్యత కోసం రాజీవ్ గాంధీ అనేక కార్యక్రమాలు నిర్వహించి ముందుకు సాగారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నేటి యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యతకు సమగ్రతకు పాటుపడాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనపట్ల దినేష్ తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు వేముల రాజు, సౌళ్ల భీమన్న తదితరులు పాల్గొన్నారు.

