కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్, జిల్లా యూనియన్, కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని(World Photography Day) బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫోటోగ్రాఫర్ల జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ రంగంలో విశేష సేవలందించిన లూయిస్ డాగురే (Louis Daguerre) సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అలాగే ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతూ మృతి చెందిన ఫోటోగ్రాఫర్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం కార్యాలయ భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్, కెమెరా క్లబ్ ప్రతినిధులతో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

