కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే (Traffic Violations) కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. రాజేందర్ రెడ్డి (Rajender Reddy) తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ (Mahabubnagar) పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా మంగళవారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అధిక శబ్దంతో నడిపే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. విధించిన జరిమానాలను ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు చేపట్టారు.
మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి, వారి సమక్షంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలు తదితర అంశాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, అధిక శబ్దంతో వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రతకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

