కలం, వలిగొండ: ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వలిగొండ (Valigonda) మండలంలోని పహిల్వాన్ పురం ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి చేసిన ప్రసంగానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil Kumar Reddy) ముగ్ధులయ్యారు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి వరుణ్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి మాట్లాడిన మాటలు అద్భుతమని, తన మాటలు వింటుంటే గర్వంతో గుండె నిండిపోయిందని ఎమ్మెల్యే అన్నారు. సభా వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంతో, స్పష్టంగా మాట్లాడిన తీరు ఆకట్టుకుందని చెప్పారు. మనం చేసే ప్రతి పనిలో గౌరవం ఉంటుందని, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కీలక భాగస్వాములేనని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి వరుణ్ మాటలు నిదర్శనమని, చిన్న వయసులోనే దేశం, సమాజం పట్ల మంచి ఆలోచనా దృక్పథం కలిగి ఉన్న వరుణ్ను, అతని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు.

